Tuesday 21 November 2017

పోతన రామాయణం - 41

9-336-క.
తండ్రి క్రియ రామచంద్రుఁడు
తండ్రుల మఱపించి ప్రజలఁ దా రక్షింపన్
తండ్రుల నందఱు మఱచిరి
తండ్రిగదా రామచంద్రధరణిపుఁ డనుచున్.
9-337-వ.
మఱియు, నా రామచంద్రుండు రాజర్షిచరితుండును, నిజధర్మనిరతుండును, నేకపత్నీవ్రతుండును, సర్వలోకసమ్మతుండును నగుచు ధర్మవిరోధంబు గాకుండఁ గోరిక లనుభవించుచుఁ ద్రేతాయుగంబైన గృతయుగధర్మంబుఁ గావించుచు, బాలమరణంబు మొదలగు నరిష్టంబులు ప్రజలకుఁ గలుగకుండ రాజ్యంబుచేయుచుండె; నయ్యెడ

భావము:
శ్రీరాముడు కన్నతండ్రిలా పరిపాలిస్తుండటంతో. ప్రజలు అందరూ మా తండ్రి శ్రీరాముడే అని అనుకుంటున్నారు. కనుక రామ పాలనలోని ప్రజలు అందరు తమ కన్నతండ్రులను సైతం మరచిపోయారు. ఇంకను, ఆ శ్రీరాముడు రాజఋషివంటివాడు స్వధర్మంలో నిష్ఠ కలవాడు. ఏకపత్నీవ్రతుడు. లోకులందరికీ ఆమోదయోగ్యుడు. దర్మమువ్యతిరేకం కాని విధంగానే కోరికలను తీర్చుకొంటూ త్రేతాయుగం అయినా కృతయుగ ధర్మాలను నడపిస్తూ ఏలుతున్నాడు. చిన్నపిల్లలు చనిపోవడం లాంటి లోకులకు కీడులు కలగనివ్వకుండ రాజ్యం ఏలుతున్నాడు. అప్పుడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=9&Ghatta=22&padyam=336

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::



No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...