Thursday 28 December 2017

ద్వారక అస్తమయం - 11

11-18-వ.
అని యనేకవిధంబులం బ్రస్తుతించిన మునివరులం గరుణాకటాక్ష వీక్షణంబుల నిరీక్షించి, పుండరీకాక్షుం డిట్లనియె; “మదీయధ్యాన నామస్మరణంబులు భవరోగహరణంబులును, బ్రహ్మరుద్రాదిక శరణంబులును, మంగళకరణంబులును నగు” ననియును, “నా రూపంబులైన మేదినీసురుల పరితాపంబులఁ బరిహరించు పురుషుల నైశ్వర్యసమేతులంగాఁ జేయుదు” ననియును, యోగీశ్వరేశ్వరుం డయిన యీశ్వరుం డానతిచ్చి యనంతరంబ “మీర లిచ్చటికివచ్చిన ప్రయోజనంబేమి?” యనిన వారలు “భవదీయ పాదారవింద సందర్శనార్థంబు కంటె మిక్కిలి విశేషం బొండెద్ది?” యని వాసుదేవవదనచంద్రామృతంబు నిజనేత్రచకోరంబులం గ్రోలి యథేచ్ఛా విహారులై ద్వారకానగరంబున కనతి దూరంబున నుండు పిండారకం బను నొక్క పుణ్యతీర్థంబున కరిగి; రంత.


భావము:
ఈ విధంగా మునివరులు అనేక విధాల స్తుతించారు. దయగల కడకంటిచూపులతో వారిని చూసి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. “నా ధ్యాన నామస్మరణలు పునర్జన్మలు అనే భవరోగాలను హరిస్తాయి. బ్రహ్మ రుద్రుడు మొదలైన వారందరికి శరణమైనవి. సకల మంగళ ప్రదములు. నా రూపాలైన బ్రాహ్మణుల బాధలను తొలగించేవారికి ఐశ్వర్యం కలిగిస్తాను.” అని యోగీశ్వరుడైన ఈశ్వరుడు ఆనతిచ్చి “మీరిక్కడికి ఎందుకు వచ్చారు.” అని అడిగాడు. అందుకు వారు “మీ పాదపద్మాలను దర్శించుట కంటే వేరే విశేషము ఏముంటుంది.” అని పలికి, వాసుదేవుని ముఖచంద్రామృతాన్ని తమ కనులనే చకోరాలతో త్రావి తమ ఇష్టానుసారం విహరించేవారు ద్వారకకు దగ్గరలోని పిండారకము అనే పుణ్యతీర్ధానికి వెళ్ళారు. అప్పుడు..



:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::




No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...