Sunday 8 March 2015

ఛత్రపతి శివాజీ రాజా....

మొగల్ చక్రవర్తులకు దక్కన్ సుల్తాన్లకు మధ్య ఏర్పడిన శక్తివంతమైన సామ్రాజ్యం మరాఠా సామ్రాజ్యం. ఈ సామ్రాజ్య స్థాపకుడిగా శివాజీని చెప్పుకోవచ్చు. శివాజీ తండ్రి షాహాజీ, ఇతడు సుల్తానుల దగ్గర సైన్యాధికారి. తల్లి జిజియాబాయి. ఈ దంపతులకు 1630, ఫిబ్రవరి 19న జున్నార్ సమీపంలోని శివనెరీ కోటలో శివాజీ జన్మించాడు.

జిజియాబాయి తాను పూజించే దేవత శివై (పార్వతి) పేరు శివాజీకి పెట్టింది.జిజియాబాయి కొడుకుకి చిన్ననాటి నుంచి భారత రామాయణ గాథలు చెప్పి వీర లక్షణాలను ఉగ్గుపట్టింది. తండ్రి పొందిన
పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అనతి కాలంలో యుద్ధ తంత్రాలలో నిష్ణాతుడయ్యాడు. మరాఠా సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా వ్యూహాలు పన్నాడు.

17 ఏళ్ల వయస్సులో శివాజీ మొట్టమొదటిగా యుద్ధం చేసి బీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను సొంతం చేసుకున్నాడు. శివాజీ బీజాపూర్ సుల్తాన్ నుంచి పురంధర్. రాయఘడ్, సింహఘడ్ వంటి అనేక కోటలను స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత శివాజీ 1664లో సూరత్ నగరాన్ని ముట్టడించాడు. కానీ 1665లో ఔరంగజేబు పంపిన జైసింగ్ పూనాపై దాడి చేసి పురంధర్ కోటను స్వాధీనం చేసుకున్నాడు. దీనితో శివాజీ పురంధర్ సంధి కుదుర్చుకున్నాడు. శివాజీ అధీనంలో ఉన్న 35 కోటల్లో 23 కోటలను మొఘలు వశం చేశాడు.

తర్వాత నాలుగు ఏళ్లకే వాటిని స్వాధీనం చేసుకున్నాడు. క్రీ.శ1674లో శివాజీ పట్టాభిషేకం చేసుకున్నాడు. శివాజీ పాలన సుదీర్ఘ కాలం యుద్ధాలతో సాగినా ఎప్పుడూ పవిత్ర స్థలాలను ధ్వంసం చేయలేదు. యుద్ధంలో పట్టుబడిన ఖైదీలు, పిల్లలు, స్ర్తీలకు సహాయం చేశాడు. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేశాడు. ఒకసారి సైనిక అధికారి చిన్న ముస్లిం రాజును ఓడించి ఆయన కోడల్ని శివాజీ ముందు బందీగా ప్రవేశపెట్టాడు. అప్పుడు శివాజీ ‘‘నా తల్లి నీ
అంత అందమైనది అయితే నేను ఇంకా అందంగా పుట్టేవాడిని’’ అని, ఆమెను తల్లిగా గౌరవించి కానుకలు పంపిం చాడు. అలాంటి మచ్చలేని వ్యక్తిత్వం శివాజీది.

మహారాష్ట్ర చరిత్రలో విశిష్టమైన స్థానాన్ని పదిల పర్చుకున్న శివాజీ కర్ణాటక ముట్టడి తర్వాత ఏప్రిల్ 3,  1680లో మరణించాడు. తన సామ్రాజ్యంలో అన్ని మతాల వారిని సమానంగా చూసిన ఆయన
అనేక దేవాలయాలతో పాటు మసీదులను కూడా నిర్మించాడు. మతసామరస్యానికి ప్రతీకగా శివాజీ పరిపాలనను ఉదాహరించవచ్చు. శివాజీ మరణం తరువాత ఆయన కుమారుడు శంభాజీ రాజ్యాపాలన
బాధ్యతలు చేపట్టి తండ్రికి తగ్గ తనయుడిగా మొగల్లను ఎదుర్కొన్నారు. జనరంజకంగా పరిపాలన సాగించాడు.

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...