Saturday 19 December 2020

శ్రీ కృష్ణ విజయము - 105

( సాందీపుని వద్ధ శిష్యులగుట )

10.1-1413-క.
అఱువదినాలుగు విద్యలు
నఱువదినాలుగు దినంబు లంతన వారల్
నెఱవాదులైన కతమున
నెఱి నొక్కొక నాటి వినికి నేర్చి రిలేశా!
10.1-1414-క.
గురువులకు నెల్ల గురులై
గురులఘుభావములు లేక కొమరారు జగ
ద్గురులు త్రిలోకహితార్థము
గురుశిష్యన్యాయలీలఁ గొలిచిరి వేడ్కన్.
10.1-1415-వ.
ఇట్లు కృతకృత్యులైన శిష్యులం జూచి వారల మహాత్మ్యంబునకు వెఱఁగుపడి సభార్యుండైన సాందీపుం డిట్లనియె.

భావము:
ఓ పరీక్షన్మహారాజా! రామకృష్ణులు ఎంతో నేర్పరులు కనుక, అరవైనాలుగు కళలనూ అరవైనాలుగు రోజులలో చక్కగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కళ చొప్పన వినడంతోనే నేర్చుసుకున్నారు. గురువులకే గురువులు, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భేద భావములు లేక ప్రకాశించు లోకగురువులు అయిన రామకృష్ణులు, ముల్లోకాలకు మేలు కలిగించడం కోసం, సంతోషంగా గురుశిష్య న్యాయంతో గురువు అయిన సాందీపుడిని సేవించారు. ఇలా, కృతార్థులైన శిష్యులను చూసి వారి ప్రభావానికి ఆశ్చర్యపడి భార్యతో ఆలోచించి, సాందీపని రామకృష్ణులతో ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=170&padyam=1414

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...