Friday 3 February 2023

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు) 

11-125-క.
రాజీవసదృశనయన! వి
రాజితసుగుణా! విదేహరాజవినుత! వి
భ్రాజితకీర్తి సుధావృత
రాజీవభవాండభాండ! రఘుకులతిలకా!
11-126-మాలి.
ధరణిదుహితృరంతా! ధర్మమార్గానుగంతా!
నిరుపమనయవంతా! నిర్జరారాతిహంతా!
గురుబుధసుఖకర్తా! కోసలక్షోణిభర్తా!
సురభయపరిహర్తా! సూరిచేతోవిహర్తా!

భావము:
పద్మములవంటి కన్నులు కలవాడ! ప్రకాశించే సుగుణాలు కలవాడా జనక మహారాజుచే పొగడబడినవాడ! ప్రకాశించే కీర్తి అనే అమృతంతో ఆవరించబడిన బ్రహ్మాండభాండం కలవాడ! రఘువంశానికి తిలకం వంటివాడ! శ్రీరామచంద్ర ప్రభు! భూదేవి పుత్రిక యైన సీతాదేవిని ఆనందింప జేయు వాడా! ధర్మమార్గాన్ని సదా అనుసరించిన వాడా! సాటిలేని నీతిమంతుడా! దేవతల శత్రువు లైన రాక్షసులను సంహరించిన వాడా! కోసల దేశ రాజ! దేవతల భయమును పోగొట్టిన వాడ! పండితుల హృదయాలలో విహరించు వాడ! శ్రీరామ!

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=18&Padyam=126

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

Thursday 2 February 2023

శ్రీకృష్ణ విజయము - ౭౨౬(726)


( శ్రీకృష్ణ నిర్యాణంబు) 

11-123-క.
ఈ కథ విన్నను వ్రాసిన
బ్రాకటముగ లక్ష్మి యశము భాగ్యము గలుగుం
జేకొని యాయువు ఘనుఁడై
లోకములో నుండు నరుఁడు లోకులు వొగడన్‌.
11-124-చ.
నగుమొగమున్‌ సుమధ్యమును నల్లని మేనును లచ్చికాటప
ట్టగు నురమున్‌ మహాభుజము లంచితకుండలకర్ణముల్‌ మదే
భగతియు నీలవేణియుఁ గృపారసదృష్టియుఁ గల్గు వెన్నుఁ డి
మ్ముగఁబొడసూపుఁగాతఁ గనుమూసినయప్పుడు విచ్చినప్పుడున్‌.

భావము:
ఈ కథను విన్నవారు, వ్రాసినవారు సిరిసంపదలు కీర్తి అదృష్టము కలిగి దీర్ఘాయువుతో లోకులు మెచ్చే గొప్పవారై ప్రకాశిస్తారు. నవ్వు ముఖము; చక్కని నడుము; నల్లని దేహము; లక్ష్మీదేవికి నివాసమైన వక్షస్థలము; పెద్ద బాహువులు; అందమైన కుండలాలు కల చెవులు; గజగమనము; నల్లనిజుట్టు; దయారసం చిందే చూపు కలిగిన విష్ణుమూర్తి నేను కనులు మూసినపుడు తెరచినపుడు పొడచూపు గాక.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=18&Padyam=124

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

Wednesday 1 February 2023

శ్రీకృష్ణ విజయము - ౭౨౫(725)

( శ్రీకృష్ణ నిర్యాణంబు) 

11-122-వ.
అనుచు నా దారుకుండు నిర్వేదనపరుండై యిట్లని విన్నవించె; “యాదవసముద్రం బడంగె; బంధు గురు మిత్ర జనంబు లక్కడక్కడం బోయిరి; ద్వారకకుం బోయి సుహృజ్జనంబులతోడ నేమందు?” నని పలుకునవసరంబున దివ్యాయుధంబులును, దివ్య రథరథ్యంబులు నంతర్ధానంబు నొందె; నారాయణుండు వానితో“ నక్రూరవిదురులకు నీవృత్తాంతం బంతయుఁ జెప్పుము; సవ్యసాచిం గని స్త్రీ బాల గురు వృద్ధ జనంబులఁ గరిపురంబునకుం గొనిచను మనుము; పొ” మ్మనిన వాఁడును మరలి చని కృష్ణుని వాక్యంబులు సవిస్తరంబుగాఁ జెప్పె; నట్లు సేయు నాలోన ద్వారకానగరంబు పరిపూర్ణజలంబై మునింగె; నంత నెవ్వరికిం జనరాకయుండె నప్పరమేశ్వరుండును శతకోటి సూర్యదివ్యతేజో విభాసితుండై వెడలి నారదాది మునిగణంబులును, బ్రహ్మరుద్రాదిదేవతలును, జయజయశబ్దంబులతోడం గదలిరా నిజపదంబున కరిగె; నన్నారాయణ విగ్రహంబు జలధి ప్రాంతంబున జగన్నాథస్వరూపంబై యుండె” నని శుకుండు పరీక్షిన్నరేంద్రునకుం జెప్పె" నని చెప్పి.

భావము:
అంటూ దారుకుడు మిక్కిలి దుఃఖంతో ఇలా విన్నవించాడు. “సముద్రమంత యాదవ సమూహం నశించింది. బంధువులు, గురువులు, మిత్రులు అందరు అటు ఇటూ చెల్లాచెదురైపోయారు. ద్వారకకు పోయి మిత్రులతో ఏమని చెప్పాలి.” అని అంటూండగానే, శ్రీకృష్ణుని దివ్యమైన ఆయుధాలు, గుఱ్ఱాలూ మాయమైపోయాయి. శ్రీకృష్ణుడు దారుకుడితో, “అక్రూరునికీ విదురునికీ జరిగిందంతా చెప్పు. స్త్రీలను, పిల్లలను, పెద్దవారిని హస్తినాపురానికి తీసుకుని వెళ్ళమని అర్జునుడితో చెప్పు. వెళ్ళు.” అన్నాడు. దారుకుడు తిరిగివెళ్ళి కృష్ణుడి మాటలు వివరంగా అందరికీ చెప్పాడు. ఆయన చెప్పినట్లు చేసేటంతలో ద్వారకానగరం పూర్తిగా జలాలలో మునిగిపోయింది. ఎవరికీ ప్రవేశించటానికి వీలులేని స్థితికి వెళ్ళిపోయింది.
అప్పుడు పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడు నూరుకోట్ల సూర్యుల దివ్యతేజస్సుతో వెడలి నారదుడు మున్నగు మునులు, బ్రహ్మదేవుడు, రుద్రుడు, మొదలయిన దేవతలు జయజయ నినాదాలతో వెంట రాగా తన స్థానానికి వెళ్ళిపోయాడు. ఆ నారాయణుని విగ్రహము సముద్ర ప్రాంతంలో జగన్నాథుడి రూపంతో ఉంది.” అని శుకబ్రహ్మ పరీక్షిన్మహారాజుకి చెప్పాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=18&Padyam=122

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

Tuesday 31 January 2023

శ్రీకృష్ణ విజయము - ౭౨౪(724)

( శ్రీకృష్ణ నిర్యాణంబు) 

11-119-క.
దారుకుఁడు గనియె నంతటఁ
జారు నిరూఢావధాను సర్వజ్ఞు హరిన్‌
మేరునగధీరు దనుజవి
దారుని నేకాంతపరునిఁ దద్దయు నెమ్మిన్‌.
11-120-వ.
కని యత్యంతభయభక్తితాత్పర్యంబుల ముకుళిత కరకమలుండై యిట్లనియె.
11-121-తే.
నిన్నుఁజూడని కన్నులు నిష్ఫలములు
నిన్ను నొడువని జిహ్వదా నీరసంబు
నిన్నుఁ గానని దినములు నింద్యము లగుఁ
గన్నులను జూచి మమ్మును గారవింపు.

భావము:
ఆ సమయంలో రథసారథి అయిన దారుకుడు వచ్చి సర్వజ్ఞుడు, మేరుపర్వతధీరుడు, దనుజ సంహారుడు అయిన శ్రీకృష్ణుడు ఒంటరిగా ఉండటం చూసాడు. అలా చూసి మిక్కిలి భయ భక్తులతో చేతులు జోడించి దారుకుడు ఇలా అన్నాడు. “నిన్ను చూడని కన్నులు నిష్ఫల మైనవి; నిన్ను వర్ణించని నాలుక నీరసమైనది; నిన్ను కనుగొనని దినాలు నిందింపదగినవి; స్వామీ! నీ కనులెత్తి మమ్ము దయతో చూడు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=18&Padyam=121

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

Sunday 22 January 2023

శ్రీకృష్ణ విజయము - ౭౨౩(723)

( శ్రీకృష్ణ నిర్యాణంబు) 

11-118-వ.
అనిన రాజునకు శుకుం డిట్లనియె “నట్లు వాసుదేవుం డన్యాయ ప్రవర్తకులగు దుష్టుల సంహరించి, న్యాయప్రవర్తకులగు శిష్టులఁ బరిపాలనంబు సేసి, బలరామ సమేతంబుగా ద్వారకానగరంబు వెడలినం గని యాదవులు దమలోఁ దాము మదిరాపానమత్తులై మత్సరంబున నుత్సాహకలహంబునకుం గమకించి, కరి తురగ రథ పదాతిబలంబులతో ననర్గళంబుగా యుద్ధసన్నద్ధులై, యుద్ధంబునకుం జొచ్చి మునిశాపకారణంబున నుత్తుంగంబు లయిన తుంగ సమూహంబుల బడలుపడంగఁ బొడుచుచు, వ్రేయుచుం దాఁకు నప్పుడు నవియును వజ్రాయుధ సమానంబులై తాఁకిన భండనంబునం బడి ఖండంబులై యొఱగు కబంధంబులును, వికలంబులైన శరీరంబులును, విభ్రష్టంబులైన రథంబులును, వికటంబులైన శకటంబులును, వ్రాలెడు నశ్వంబులును, మ్రొగ్గెడి గజంబులునై, యయ్యోధనంబున నందఱుం బొలియుటకు నగి నగధరుండును రాముండునుం జనిచని; యంత నీలాంబరుం డొక్క త్రోవంబోయి యోగమార్గంబు నననంతునిం గలసె; నప్పరమేశ్వరుండు మఱియొక మార్గంబునం జని యొక్క నికుంజపుంజంబు చాటున విశ్రమించుటంజేసి చరణంబు వేఱొక చరణంబు మీఁద సంఘటించి చంచలంబుగా వినోదంబు సలుపు సమయంబున నొక్క లుబ్ధకుండు మృగయార్థంబుగా వచ్చి దిక్కులు నిక్కి నిరీక్షించుచుండ, వృక్షంబు చాటున నప్పరమపురుషుని చరణ కమలంబు హరిణకర్ణంబు గాఁబోలునని దానిం గని శరంబు శరాసనంబునందు సంధానంబు సేసి యేసిన నతండు హాహారవంబునం గదలుచుండ నప్పరమేశ్వరుని సన్నిధానంబునకు వచ్చి జగన్నాథుంగాఁ దెలిసి, భయంబున “మహాపరాధుండను; బాపచిత్తుం డను; గుటిలప్రచారుండ” నని యనేకవిధ దీనాలాపంబులం బలుకుచు బాష్పజలధారాసిక్తవదనుండైన, సరోజనేత్రుండు వానిం గరుణించి యిట్లనియె; “నీ వేల జాలింబడెదు? పూర్వజన్మ కర్మంబు లెంత వారికైన ననుభావ్యంబులగుం గాని యూరక పోవనేరవు; నీవు నిమిత్తమాత్రుండ; వింతియ కాని” యని వానికిం దెలిపిన వాఁడును “మహాపరాధులైన వారూరక పోవరు; దేవ గురు వైష్ణవ ద్రోహులకు నిలువ నెట్లగు” నని పవిత్రాంతఃకరణుండై ప్రాయోపవేశంబునం బ్రాణంబులు వర్జించి వైకుంఠపదప్రాప్తుండయ్యె నప్పుడు.

భావము:
ఇలా అడిగిన రాజుతో శుకుడు ఇలా చెప్పాడు. “అలా శ్రీకృష్ణుడు అన్యాయమార్గంలో నడిచే దుర్మార్గులను చంపి, న్యాయమార్గంలో నడిచే సజ్జనులను కాపాడి బలరాముడు తాను ద్వారకనుండి వెళ్ళిపోయారు. పిమ్మట యాదవులు తమలో తాము మద్యపానంచేసి మత్తిల్లి, ఈర్ష్యతో పరిహాసంగా పోట్లాడుకోవడం మొదలుపెట్టారు. అది నిజమైన పోట్లాటగా మారింది. ఏనుగులు, గుఱ్ఱాలు, రథాలు, కాల్బలములు తోకూడి అడ్డు ఆపు లేకుండా వారిలో వారే యుద్ధాలు మొదలుపెట్టారు. మునిశాపం కారణంగా ఎత్తుగా పెరిగిన తుంగ బెత్తాలతో అలసిపోయేలా కొట్టుకుంటూ బాదుకుంటూ యుద్ధాలు చేయసాగారు. ఆ తుంగబెత్తాలు వజ్రాయుధంతో సమానమైన ఆయుధాలవలె తాక సాగాయి. అలా ఒకరినొకరు పొడుచుకుంటూ భయంకరంగా యుద్ధం చేశారు. రణరంగమంతా ముక్కలు ముక్కలై చెదరిన మొండెములతో, వికలమైన దేహాలతో, విరిగిన రథాలతో, కూలిన గుఱ్ఱాలతో, వాలిన ఏనుగులతో నిండిపోయింది. యాదవులు అందరూ ఆ సమరంలో చచ్చిపోయారు. ఇదంతా చూసి నవ్వుకుంటూ శ్రీకృష్ణుడు బలరాముడు ఎటో వెళ్ళిపోయారు. కొంతదూరం వెళ్ళిన తరువాత బలరాముడు ఒక్కడు వేరు మార్గాన పోయి యోగమార్గంతో అనంతునిలో కలిశాడు. పరమేశ్వరుడు శ్రీకృష్ణుడు మరో మార్గంలో వెళ్ళి ఒక గుబురు పొద చాటున విశ్రాంతిగా పడుకుని ఒక కాలు మీద మరొక కాలు పెట్టి వినోదంగా ఆడిస్తున్నాడు. ఆ సమయంలో, ఒక బోయవాడు వేటకు వచ్చి అన్ని ప్రక్కలకు నిక్కి చూస్తూ ఉంటే, ఆ చెట్టుచాటున ఆ పరమపురుషుని కదలుతున్న కాలు లేడి చెవిలాగా కనిపించింది. అది చూసి, అంబులపొది నుంచి బాణం తీసి విల్లెక్కుపెట్టి గురిచూసి కొట్టాడు. ఆ బాణం తగిలి శ్రీకృష్ణుడు హాహాకారం చేయసాగాడు. వాడు దగ్గరకు వచ్చి చూసి జగదీశ్వరుడైన కృష్ణుడని తెలుసుకుని భయంతో, “అపరాధం చేసాను పాపాత్ముడిని వక్రబుద్ధిని.” అని రకరకాలుగా దీనంగా ఏడుస్తూ కన్నీరు కార్చసాగాడు. వానిని చూసి కృష్ణుడు దయతో ఇలా అన్నాడు. “నీవు దుఃఖిచనక్కర లేదు. పూర్వజన్మల కర్మలు అనుభవించక ఎంతటి వారికి అయినా తప్పవు. వాటి ఫలితాల ఊరకే పోవు. నీవు నిమిత్రమాత్రుడివి మాత్రమే.” ఇలా వాడికి నచ్చ చెప్పినా వాడు, “ఇంత పెద్ద తప్పు చేసాక ఊరకే పోదు. దైవానికి, గురువులకు, వైష్ణవులకు, ద్రోహం చేసినవాడు ధరణిపై నిలువరాదు.” అని పలికి, పవిత్రమైన మనస్సుతో ప్రాయోపవేశం చేసి ప్రాణాలు వదిలి వైకుంఠానికి వెళ్ళాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=18&Padyam=118

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

Saturday 21 January 2023

శ్రీకృష్ణ విజయము - ౭౨౨(722)

( అవధూత సంభాషణ ) 

11-116-క.
చెప్పిన విని రాజేంద్రుఁడు
సొప్పడ శ్రీకృష్ణుకథలు చోద్యము గాఁగం
జెప్పినఁ దనియదు చిత్తం
బొప్పఁగ మునిచంద్ర! నాకు యోగులు మెచ్చన్‌.
11-117-తే.
అంతటను గృష్ణుఁ డేమయ్యె? నరసిచూడ
యదువు లెట్టులు వర్తించి రేర్పడంగ,
ద్వారకాపట్టణం బెవ్విధమున నుండె
మునివరశ్రేష్ఠ! యానతీ ముదముతోడ.

భావము:
ఆ శుకబ్రహ్మ పలుకులు వినిన రాజేంద్రుడు, “మునీశ్వరా! శ్రీకృష్ణుడి కథలు చాలా అద్భుతంగా ఉంటాయి. యోగులు మెచ్చేలా మీరెంత చెప్పినా నేను ఎంత విన్నా తనివితీరడం లేదు. మునివర్యా! అటుపిమ్మట శ్రీకృష్ణుడు ఎమయ్యాడు? యాదవులు ఏం చేసారు? ద్వారకపట్టణం ఏమయింది? అన్నివిషయాలూ ఆనతీయవలసినది.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=17&Padyam=117

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

శ్రీకృష్ణ విజయము - ౭౨౧(721)

( అవధూత సంభాషణ ) 

11-115-వ.
అని యుద్ధవుం డడిగిన నారాయణుం డిట్లనియె; “నేను సర్వవర్ణంబులకు సమంబైన పూజాప్రకారం బెఱింగించెద; నాచారంబునంజేసి యొకటిఁ బాషాణమృణ్మయదారువులం గల్పించి, నా రూపంబుగా నిల్పికొని కొందఱు పూజింతురు; కాంస్య త్రపు రజత కాంచన ప్రతిమావిశేషంబు లుత్తమంబు; లిట్లు నా ప్రతిమారూపంబు లందు మద్భావంబుంచి కొల్చినవారికి నేఁ బ్రసన్నుండనగుదు; నీ లోకంబున మనుష్యులకు ధ్యానంబు నిలువనేరదు; గావునం బ్రతిమా విశేషంబు లనేకంబులు గలవు; వానియందు సౌందర్యసారంబులు మనోహరంబులునైన రూపంబుల మనఃప్రసన్నుండనై నే నుండుదుఁ; గావున దుగ్ధార్ణవశాయిఁగా భావించి ధౌతాంబరాభరణ మాల్యానులేపనంబులను, దివ్యాన్న పానంబులను, షోడశోక్త ప్రకారంబుల రాజోపచారంబులను, బాహ్యపూజా విధానంబుల నాచరించి మత్సంకల్పితంబు లైన పదార్థంబులు సమర్పించి, నిత్యంబును నాభ్యంతరపూజావిధానంబులం బరితుష్టునిం జేసి; దివ్యాంబరాభరణ మాల్యశోభితుండును, శంఖ చక్ర కిరీటాద్యలంకార భూషితుండును, దివ్యమంగళవిగ్రహుండునుగాఁ దలంచి ధ్యానపరవశుండైన యతండు నాయందుఁ గలయు; నుద్ధవా! నీ వీ ప్రకారంబు గరిష్ఠనిష్ఠాతిశయంబున యోగనిష్ఠుండవై, బదరికాశ్రమంబు సేరి మత్కథితం బైన సాంఖ్యయోగం బంతరంగంబున నిల్పుకొని, కలియుగావసాన పర్యంతంబు వర్తింపు” మని యప్పమేశ్వరుండానతిచ్చిన నుద్ధవుండు నానందభరితాంతరంగుం డై తత్పాదారవిందంబులు హృదయంబునం జేర్చుకొని, పావనంబైన బదరికాశ్రమంబునకు నరిగె” నని శుకుండు పరీక్షిన్నరేంద్రునకుం జెప్పుటయు.

భావము:
ఉద్ధవుడు ఇలా అడుగగా శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. “నేను అన్ని వర్ణాలవారు అనుసరించ తగ్గ పూజా పద్ధతి చెప్తాను, విను. రాతితో కాని, మట్టితో కానీ, కొయ్యతో కానీ తమ ఆచారం ప్రకారం ఒక ఆకారం కల్పించి ఒక పేరుపెట్టి కొందరు పూజిస్తారు. కంచుతో కానీ, సీసంతో కానీ, వెండితో కానీ, బంగారంతో కానీ చేసిన ప్రతిమలు శ్రేష్ఠమైనవి. ఈవిధంగా నా ప్రతిరూపాలలో నా భావాన్ని ఉంచి కొలచిన వారికి, నేను ప్రసన్నుడను అవుతాను. ఈ లోకంలో మానవులకు ధ్యానం నిలువదు కనుక, ఎన్నో విధాలుగా ఉండే దేవతా ప్రతిమలలో బాగా అందంగా ఉండే రూపాలలో నేను ప్రసన్నుడనై ఉంటాను. కాబట్టి, క్షీరసాగరంలో పడుకున్నవానిగా భావించి; శుభ్రమైన వస్త్రాలను, ఆభరణాలను, పూలదండలను, మైపూతలను అర్పించి దివ్యమైన అన్నపానాలు, షోడశోపచారాలతో రాజోపచారాలు, బాహ్యమైన పూజలు చేసి నాకిష్టమైన పదార్ధాలను సమర్పించి కానీ; లేదా ప్రతిదినము మానసిక పూజాపద్ధతులతో కాని సంతుష్టి పరచి నన్ను దివ్యమైన వస్త్రాలు, భూషణాలు పూలదండలు ధరించి ప్రకాశిస్తూ; శంఖము, చక్రము, కిరీటము, మొదలైన వానితో అలంకృతుడనైన మంగళవిగ్రహునిగా భావించి ధ్యానపరవశుడు అగు నా భక్తుడు నా యందు కలుస్తాడు. ఉద్ధవా! నీవు ఇటువంటి తీవ్రతరమైన యోగనిష్ఠతో బదరికాశ్రమం చేరు. నేను చెప్పిన సాంఖ్యయోగాన్ని మనస్సులో నిలుపుకుని కలియుగం చివరి దాకా ఉండు.” అని పరమేశ్వరుడు ఆనతీయగా ఉద్ధవుడు మనసు నిండా ఆనందం పొంగిపొర్లింది. శ్రీకృష్ణుని పాదపద్మాలను హృదయాన చేర్చుకుని పవిత్రమైన బదరికాశ్రమానికి వెళ్ళాడు.” అని శుకముని మహారాజు పరీక్షిత్తునకు చెప్పాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=17&Padyam=115

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...