Tuesday, 4 November 2014

వైకుంఠ చతుర్దశి

వైకుంఠ చతుర్దశి: ( 05/11/2014 )

కార్తీక శుద్ధ చతుర్దశిని 'వైకుంఠ చతుర్దశి'గా
పిలుస్తుంటారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఈ రోజున శివుడిని పూజిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ కారణంగా ఈ రోజు అత్యంత విశిష్టమైనదిగా చెప్పబడుతోంది. కర్తవ్యపాలన విషయంలోనే శివకేశవులు వేరుగా కనిపిస్తూ వుంటారు. నిజానికి వారిద్దరూ ఒకటేనని వేదకాలంలోనే
చెప్పబడింది.

ఈ నేపథ్యంలో భక్తుల ముందుకు ఒక వరంగా వచ్చే విశిష్టమైన రోజే 'వైకుంఠ చతుర్దశి'. సమస్త మానవాళిచే పూజలు అందుకుంటూ వుండే విష్ణుమూర్తి, ఈ
రోజున శివుడిని పూజిస్తాడంటే ఇది ఎంతటి పవిత్రమైన రోజో అర్థం చేసుకోవచ్చు. ఈ రోజున శ్రీమహావిష్ణువు వైకుంఠం నుంచి నేరుగా కాశీ నగరానికి వెళ్లి అక్కడి విశ్వనాథుడిని అర్చిస్తాడని అంటారు.

ఒకానొక సమయంలో దానవమూకలు మహా బలవంతులయ్యారు. దేవతలంతా విష్ణువు చెంత చేరి దానవులను అణచి వేయవలసిందిగా ప్రార్థించారు. ఇందుకు శివారాధనే శరణ్యం అని చెప్పి వెయ్యి కమలాలతో శివ సహస్ర నామాలను అర్చించాలని నిర్ణయించుకున్నాడు. వెయ్యి పువ్వులూ కోసి తెచ్చి పెట్టుకున్నాడు. నామానికొక పుష్పం అర్పిస్తున్నాడు నారాయణుడు.. శ్రీపతిని పరిక్షించాలని శివుడు ఓ పుష్పాన్ని మాయం చేశాడు, మాయమైన పుష్ప లోకులంతా కమలాక్షుడని తనను పిలవడం సంగతి
గుర్తొచ్చి, ఆ వెయ్యోనామం అర్చించడానికి తన నేత్రాన్ని పెకలించాలని ఉధ్యుక్తుడవుతూండగా పరమశివుడు వారిస్తూ ప్రత్యక్షమయ్యాడు.. దేవతల సంరక్షణార్ధం ఇంత దుస్సాహసానికి వొడిగట్టిన శ్రీహరిని మనస్ఫూర్తిగా దీవించి తనచే నిర్మితమైన "సుదర్శనం" అనే చక్రాన్ని ప్రసాదించి, 'దీనికి ఎదురులేదు! ఎంత మందిని నిర్జించినా - తిరిగి నీవద్దకు చేరుకుంటుంది' అని అనుగ్రహించాడు.

ఇక ఈ రోజున లింగవ్రతాన్ని ఆచరించి జాగరణ చేసిన వారికి మోక్షం లభిస్తుంది. శివకేశవులను ఆరాధిస్తూ అనుగ్రహాన్ని పొందే ఈ రోజున ఇత్తడి కుందుల్లో గానీ, రాగి కుందుల్లో గాని దీపాలను వెలిగించి వాటిని దానాలు చేయాలి. ఈ విధంగా చేయడం వలన సమస్త దోషాలు సకల పాపాలు తొలగిపోతాయి ... ఆశించే శుభాలు ఆనందంగా చేకూరతాయి.

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...