Monday 7 March 2016

మహాశివరాత్రి.....

07 - 03 - 2016 , సోమవారం, మాఘ బహుళ చతుర్దశి

మాఘ మాసంలో పౌర్ణమి తరువాత పద్నాల్గవ రోజున వచ్చే శివరాత్రి ఇది. ఈ రాత్రి ఆధ్యాత్మిక మార్గంలో ఉండేవారు ప్రత్యేక సాధనలు చేస్తారు. ప్రతి సంవత్సరం వచ్చే పన్నెండు శివరాత్రులలో మాఘమాసంలో వచ్చే శివరాత్రిని మహాశివరాత్రి అంటారు. ఎందుకంటే అది అన్ని శివరాత్రులలో కెల్లా మహత్తరమైనది, శక్తివంతమైనది. మనలోని శక్తులు ఉప్పొంగే రాత్రి మహాశివరాత్రి!

ఒకనాడు పార్వతీదేవి శివుడితో "ప్రాణేశ! పాపం భూలోకములోని మానవులు ప్రారబ్ధ కర్మలతో చాలా బాధలను అనుభవిస్తున్నారు. ఇటువంటివారికి కఠినమయిన నియమనిష్ఠలు లేకుండా యఙ్ఞ యాగాదులు జపతపఫలములు లేని సులభతరమైన ఒక వ్రతమును తెలిపి వారికి ముక్తిని కలుగేటట్లు చేయండి" అని పార్వతి అన్నది. అప్పుడు శివుడు పార్వతితో యిలా అన్నాడు."దేవి! శివరాత్రి వ్రతము అనే వ్రతము ఒకటి ఉంది. ఆ ప్రతము సర్వ యఙ్ఞములకు సమానమయినది. ఉత్తమోత్తమయినది. ముక్తి ప్రదమైనది. దాని కథ చెబుతాను విను...

పూర్వము ఒక పర్వత ప్రాంతమున వ్యాధుడనే వేటగాడు ఉండేవాడు. అతను ప్రతి ఉదయము అడవికి వేటకు వెళ్ళి సాయంకాలానికి ఏదో ఒక మృగమును చంపి ఇంటికి తెచ్చేవాడు. దానితో అతని కుటుంబము పొట్టనింపుకుంటూ ఉండేది. ఒకరోజు అతను ఎప్పటిలా అడవికి వెళ్ళాడు. అడవి అంతా తిరిగినా అతనికి ఒక్క మృగము కనపడలేదు. వట్టి చేతులతో యింటికి వెళ్ళటానికి మనసొప్పక, చేసేది లేక యింటికి బయలు దేరాడు. దారిలో అతనికి ఒక సరస్సు కనబడింది. "ఏ మృగమైన నీరు త్రాగటానికి ఈ తటాకము దగ్గరకు రాకపోతుందా" అనే ఆశతో ఒక చెట్టుపైకి ఎక్కికూర్చున్నాడు సరస్సు వైపు చూస్తూ, అడ్డుగా ఉన్న కొమ్మలను విరిచి, ఆకులను దూసి క్రింద పడవేసి, చలికి ’శివ-శివ’ అనుకుంటూ సరస్సు వైపు చూస్తూ కూర్చున్నాడు.

మొదటి జామునకు ఒక లేడి నీరు త్రాగటానికి ఆ సరస్సు దగ్గరకు వచ్చింది. వేటగాడు ఆనందముతో బాణము విడువబోయాడు. "వ్యాధుడా! నన్ను చంపకు " అని మానవ గొంతుతో ఆ లేడి యిలా అన్నది. "నేను గర్భిణిని. నా వలన నీ కుటుంబానికి సరిపడే భోజనము లభించదు. కాబట్టి నన్ను వదులు. కాసేపట్లో ఇంకో జింక ఇక్కడకు వస్తుంది. దాన్ని చంపు. లేకపోతే నేను వెళ్ళి బిడ్డను కని దాన్ని బంధువులకి అప్పగించి వస్తాను " అన్నది.

సరే నన్నాడు వేటగాడు. రెండవ జామునకు ఇంకో జింక కనిపించింది. మొదటి జింకే అనుకున్న వేటగాడు బాణము వేయబోగా ఆ జింక భయపడుతూ మానవ కంఠంతో "ఓ వ్యాధుడా! నా మాట విను. తరువాత
నన్ను చంపవచ్చు.నేను విరహముతో కృశించిపోయి ఉన్నాను. నాలో మాంసములు లేవు. నన్ను చంపినా
నీకు నీ కుటుంబానికి సరిపోను. కాసేపటికి బాగా బలిసిన మగజింక ఇక్కడకు వస్తుంది. దానిని చంపు. అలా కాకపోతే నేనే తిరిగి వస్తాను " అన్నది. సరేనన్నాడు వ్యాధుడు

మూడవజాము అయింది. వేటగాడు ఆకలితో జింక కోసము ఆతృతగా చూస్తున్నాడు. బలిసిన మగజింక రానే వచ్చింది. వేటగాడు దాన్ని చూసిన వెంటనే బాణము విడవబోయేంతలో మృగము వేటగాడిని చూసి, తన ప్రియురాలిని కూడా వాడే చంపి ఉంటాడని తలచింది.అయినా అడిగితే సందేహము తీరి పోతుందని " ఓ వేటగాడా! రెండు జింకలు ఇక్కడకు వచ్చాయా? అవి ఎటు పోయాయి? వాటిని నువ్వు చంపావా" అని ప్రశ్నించెను. వేటగాడు దాని మాటలకు మునుపటి లానే ఆశ్చర్యపడి రెండు తిరిగి వస్తానని చెప్పి వెళ్ళాయి. నిన్ను నాకు ఆహారంగా పంపాయి అన్నాడు. "సరే అయితే! నేను ఉదయం నీ యింటికి వస్తాను.నా భార్య ఋతుమతి. ఆమెతో గడిపి, బంధుమిత్రులతో అనుమతి పొంది నేను మళ్ళీ వస్తాను" అని అనేక ప్రమాణాలు చేసి వెళ్ళింది. ఇంతలో ఇంకొక జింక తన పిల్లలతో వచ్చింది. "వ్యాధుడా! నేను పిల్లతో వచ్చాను. దీన్ని యింటి దగ్గర వుంచి త్వరగా వస్తాను అంది. ఈ విధంగా నాలుగు జాములు గదిచిపోయాయి. సూర్యోదయం అయింది. వ్యాధుడు జింకల కొరకు ఎదురుచూస్తూ దిక్కులు వెతకసాగడు. కొంతసేపటికి నాలుగు జింకలు వచ్చాయి. "’ నేను సిద్దంగా ఉన్నాను నన్ను చంపు’ అంటే ’నన్ను చంపు’ అని నాలుగు జింకలు వ్యాధుని ఎదుట మోకరిల్లాయి. జింకల సత్యసంధతకు వ్యాధుడు ఆశ్చర్యపడ్డాడు. వాటిని చంపుటకు అతని మనసు అంగీకరించలేదు.

వ్యాధుడికి తన హింసావృత్తి మీద తనకే అసహ్యమేసింది. "ఓ మృగములారా ! మీరు మీ నివాసములకు వెళ్ళిపొండి. నాకు మీ మాంసము అక్కర్లేదు. ఈ విధంగా మృగాలను వేటాడి బంధించి చంపి నాకుటుంబాన్ని పోషించుకోవటం పరమ నికృష్టంగా తోస్తోంది. చేసిన పాపము చేశాను. ఇక తిరిగి ఈ పాపము చేయను. ధర్మములకు దయ మూలము. దయ చూపడం కూడా సత్యఫలమే" అన్నాడు. వ్యాధుని మాటలకు ఆకాశంలో దేవ
దుందుభులు మ్రోగాయి.పూలవాన కురిసింది. దేవదూతలు చక్కని విమానంలో వచ్చి "ఓ మహాసత్త్వుడా! ఉపవాసము , జాగరణ, శివరాత్రి ప్రభావమున వలన నీ పాపము నశించింది. నీవెక్కి కూర్చున్నది బిల్వ వృక్షము. నీకు తెలియకుండానే
జాము జామునకు బిల్వదళాలను త్రుంచి క్రింద ఉన్న స్వయంభూలింగాన్ని పూజించావు." అంటూ వారందరిని సశరీరంగా స్వర్గానికి తీసుకెళ్ళారు.

ఈ కథను పరమేశ్వరుడు పార్వతిదేవికి చెప్పి "దేవి! ఆ మృగకుటుంబమే ఆకాశంలో కనిపించే మృగశిర నక్షత్రము. కనిపించు మిగిలిన మూడు నక్షత్రములలో
ముందున్నవి జింక పిల్లల్లు వెనుకకున్నది మృగి. ఈ మూడింటిని మృగశీర్షమంటారు. వాటి వెనుక ఉజ్జ్వలంగా ఉన్నది వేటగాని నక్షత్రము. శివరాత్రితో సమానమయిన మరియొక వ్రతము లేదు’ అని తెలిపాడు భోళాశంకరుడు.

అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు......

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...