Tuesday 18 December 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 74

10.1-568-వ.
దేవా! యిట్టి నీవు జీవాత్మ స్వరూపకుఁడవు, సకలాత్మలకు నాత్మయైన పరమాత్మ స్వరూపకుఁడవు నని యెవ్వ రెఱుంగుదురు, వారు గదా గురు వనియెడు దినకరునివలనఁ బ్రాప్తంబైన యుపనిషదర్థజ్ఞానం బను సునేత్రంబునంజేసి సంసార మిథ్యాసాగరంబుఁ దరించిన చందంబున నుండుదురు; రజ్జువందు రజ్జువని యెఱింగెడి యెఱుక లేకుండ, న య్యెఱుంగమి నది సర్పరూపంబయి తోఁచిన పిదప నెఱింగిన వారివలన రజ్జువు రజ్ఝువని యెఱుంగుచుండ, సర్పరూపంబు లేకుండు కైవడి, నాత్మ యప్పరమాత్మ యని యెవ్వ రెఱుంగరు వారి కయ్యెఱుంగమివలన సకల ప్రపంచంబు గలిగి తోఁచు; నాత్మ యప్పరమాత్మ యని యెవ్వరెఱుంగుదురు, వారి కయ్యెఱుకవలనఁ బ్రపంచంబు లేకుండు నజ్ఞాన సంభావిత నామకంబులైన సంసార బంధ మోక్షంబులు, జ్ఞాన విజ్ఞానంబులలోనివి గావు; కావునఁ గమలమిత్రున కహోరాత్రంబులు లేని తెఱంగునఁ, బరిపూర్ణ జ్ఞానమూర్తి యగు నాత్మ యందు నజ్ఞానంబులేమిని బంధంబును సుజ్ఞానంబు లేమిని మోక్షంబు లే; వాత్మవయిన నిన్ను దేహాదికంబని తలంచియు, దేహాదికంబు నిన్నుఁగాఁ దలంచియు, నాత్మ వెలినుండు నంచు మూఢులు మూఢత్వంబున వెదకుచుందురు; వారి మూఢత్వంబుఁ జెప్పనేల? బుద్ధిమంతులయి పరతత్వంబు గాని జడంబును నిషేధించుచున్న సత్పురుషులు తమ తమ శరీరంబుల యంద నిన్నరయుచుందు రదిగావున.

భావము:
ఓ దేవా! శ్రీకృష్ణా! ఇట్టి నీవు జీవాత్మస్వరూపుడ వని; ఆత్మలు అన్నింటికీ ఆత్మ యైన పరమాత్మ స్వరూపుడ వని గ్రహించ గలిగినవారు, గురువు అనే సూర్యుని వలన ఉపనిషత్తుల జ్ఞానం అనే కన్నును పొందినవారు. అటువంటివారు సంసార మనే ఈ మాయాసముద్రాన్ని దాటినట్లు కనిపిస్తారు. అది త్రాడే అను జ్ఞానం లేనప్పుడు, దానిని చూస్తే అది పాములా కనిపిస్తుంది. తరవాత తెలిసినవారి వలన అది త్రాడే అని తెలుసుకున్న తర్వాత ఇంక పాము అనే రూపం ఉండదు. అలాగే తనలో నున్న ఆత్మయే పరమాత్మ అని తెలియని వారికి, ఈ ప్రపంచ మంతా ఉన్నట్లుగా కనిపిస్తుంది. తరువాత తాను ఆత్మ అని ఆత్మయే పరమాత్మ అని తెలిసిన తరువాత వారికి “అజ్ఞానం కారణంగా ఈ ప్రపంచమంతా తనకు కనిపించినదే తప్ప నిజంగా అక్కడ ఏమీ లే” దని తెలుస్తుంది. సంసారబంధము అనేది అజ్ఞానం వలన పుట్టినది. మోక్షం అనేది కూడా అజ్ఞానం వలననే పుట్టినదే. ఈ బంధ మోక్షాలు జ్ఞాన విజ్ఞానాల లోనికి చేరవు. సూర్యుని చుట్టూ భూమి పరిభ్రమణం వలన మనకు రాత్రింబవళ్ళు ఉన్నాయి గానీ సూర్యునికి రాత్రి పగలు లేవు అలాగే సంపూర్ణు డైన, జ్ఞాన స్వరూపు డైన ఆత్మకు అజ్ఞానం లేనందువలన బంధ మోక్షాలు ఉండవు. ఆత్మ వైన నిన్ను శరీర మని శరీరాదులు నీ వని భావించేవారు శరీరానికి బయట ఎక్కడో ఆత్మ ఉంటుంది అనుకునేవారు మూఢులు. అంటే మోహం చెందిన వారు. అ మోహంలోనే పడి ఆత్మ కోసం వెతుకులాడుతూ ఉంటారు. వారి మూఢత్వం ఇంత అని చెప్పడ మెందుకు. జడపదార్ధంలో కూడా పరమాత్మనే దర్శనం చేసేవారు బుద్ధిమంతు లైన సత్పురుషులు. వారు తమ శరీరాల లోనే నిన్ను చూడగలుగుతారు. అందుచేత. . .

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=74&padyam=568

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...