Wednesday 11 September 2019

కపిల దేవహూతి సంవాదం - 111


( చంద్ర సూర్య పితృ మార్గంబు )

3-1027-వ.
అదిగావున, నీకుం జతుర్విధ భక్తియోగప్రకారంబుఁ దేటపడఁ నెఱింగించితి; అదియునుం గాక, కామరూప యగు మదీయ గతి జంతువుల యందు నుత్పత్తి వినాశ రూపంబుల నుండు నవిద్యా కర్మ నిర్మితంబు లైన జీవునిగతు లనేక ప్రకారంబులై యుండు; అదియు జీవాత్మ వాని యందుం బ్రవర్తించి యాత్మగతి యిట్టిదని యెఱుంగక యుండు" నని చెప్పి, మఱియు నిట్లనియె "ఇట్టి యతి రహస్యం బగు సాంఖ్యయోగ ప్రకారంబు ఖలునకు నవినీతునకు జడునకు దురాచారునకు డాంబికునకు నింద్రియలోలునకుఁ బుత్ర దారాగారాద్యత్యంతాసక్త చిత్తునకు భగవద్భక్తిహీనునకు విష్ణుదాసుల యందు ద్వేషపడు వానికి నుపదేశింప వలవదు; శ్రద్ధాసంపన్నుండును, భక్తుండును, వినీతుండును, నసూయారహితుండును, సర్వభూత మిత్రుండును, శుశ్రూషాభిరతుండును, బాహ్యార్థజాత విరక్తుండును, శాంతచిత్తుండును, నిర్మత్సరుండును, శుద్ధాత్ముండును, మద్భక్తుండును, నగు నధికారికి నుపదేశింప నర్హంబగు; ఈ యుపాఖ్యానం బే పురుషుండేనిఁ బతివ్రత యగు నుత్తమాంగన యేని శ్రద్ధాభక్తులు గలిగి మదర్పితచిత్తంబునన్ వినుఁ బఠియించు నట్టి పుణ్యాత్ములు మదీయ దివ్యస్వరూపంబుఁ బ్రాపింతు" రని చెప్పెను" అని మైత్రేయుండు విదురునకు వెండియు నిట్లనియె "ఈ ప్రకారంబునం గర్దమదయిత యైన దేవహూతి గపిలుని వచనంబులు విని నిర్ముక్తమోహ పటల యగుచు సాష్టాంగ దండప్రణామంబు లాచరించి తత్త్వవిషయాంకిత సాంఖ్యజ్ఞానప్రవర్తకం బగు స్తోత్రంబుసేయ నుపక్రమించి కపిలున కిట్లనియె.

భావము:
అందువల్ల నీకు నాలుగు విధాలైన భక్తి మార్గాలను విశదంగా తెలియజెప్పాను. అంతేకాక స్వేచ్ఛారూపమైన నా సంకల్పం ప్రాణులందు జనన మరణ రూపాలతో ఉంటుంది. అజ్ఞానంతో ఆచరించే కర్మల మూలంగా కలిగే జీవుని ప్రవర్తనలు అనేక విధాలుగా ఉంటాయి. జీవాత్మ అటువంటి అకర్మలు ఆచరిస్తూ అత్మస్వరూపం ఇటువంటిది అని తెలియని స్థితిలో ఉంటాడు” అని చెప్పి మళ్ళీ ఇలా అన్నాడు. “ఇటువంటి అతిరహస్యమైన సాంఖ్యయోగ పద్ధతి దుష్టునకు, నీతి హీనునకు, మూర్ఖునకు, దురాచారునకు, డంబాలు కొట్టేవానికి, ఇంద్రియ సుఖాలకు లోబడిన వానికి, పిల్లలూ ఇల్లాలూ ఇల్లూ మొదలైన వానిపై ఆసక్తి కలవానికి, భగవంతునిపై భక్తి లేనివానికి, విష్ణు భక్తులను ద్వేషించే వానికి ఉపదేశింపకూడదు. శ్రద్ధాసక్తుడు, భక్తుడు, వినయసంపన్నుడు, ద్వేషరహితుడు, సర్వప్రాణులను మైత్రీభావంతో చూచేవాడు, విజ్ఞాన విషయాలను వినాలనే అసక్తి కలవాడు, ప్రాపంచిక విషయాలపై విరక్తుడు, శాంతచిత్తుడు, మాత్సర్యం లేనివాడు, స్వచ్ఛమైన మనస్సు కలవాడు, భక్తులందు ప్రేమ కలవాడు, పరస్త్రీలను మంచి భావంతో చూచేవాడు, చెడు కోరికలు లేనివాడు అయిన వానికి మాత్రమే ఈ సాంఖ్యయోగం ఉపదేశింప తగినది. అటువంటివాడే ఇందుకు అర్హుడైన అధికారి. ఈ ఉపాఖ్యానాన్ని ఏ పురుషుడైనా, పతివ్రత అయిన ఏ స్త్రీ అయినా శ్రద్ధాభక్తులతో నాపై మనస్సు నిలిపి వినినా, చదివినా అటువంటి పుణ్యాత్ములు నా దివ్య స్వరూపాన్ని పొందుతారు” అని కపిలుడు దేవహూతితో చెప్పాడని చెప్పి మైత్రేయుడు విదురుణ్ణి చూచి ఇంకా ఇలా అన్నాడు. “ఈ విధంగా కర్దమమహర్షి అర్ధాంగి అయిన దేవహూతి కపిలుని ఉపదేశం విని, మోహం తొలగిపోగా అతనికి సాష్టాంగ దండ ప్రణామాలు చేసి, పరబ్రహ్మకు సంబంధించిన తాత్త్వికమైన సాంఖ్య జ్ఞానంతో కపిలుణ్ణి స్తోత్రం చేయడం ప్రారంభించి ఇలా అన్నది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=54&padyam=1027

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...