Monday 30 March 2020

ధ్రువోపాఖ్యానము - 21


4-278-సీ.
హరి యీశ్వరుండు విహంగ కులేశ్వర;
యానుఁడై నిజభృత్యుఁడైన ధ్రువునిఁ
గనుఁగొను వేఁడుక జనియింప నా మధు;
వనమున కప్పుడు చని ధ్రువుండు
పరువడి యోగవిపాక తీవ్రంబైన;
బుద్దిచే నిజమనోంబురుహ ముకుళ
మందుఁ దటిత్ప్రభాయత మూర్తి యటఁ దిరో;
ధానంబునను బొంది తత్క్షణంబ
4-278.1-తే.
తన పురోభాగమందు నిల్చినను బూర్వ
సమధికజ్ఞాన నయన గోచర సమగ్ర
మూర్తిఁ గనుఁగొని సంభ్రమమునను సమ్మ
దాశ్రువులు రాలఁ బులకీకృతాంగుఁ డగుచు
4-279-తే.
నయనముల విభుమూర్తిఁ బానంబు చేయు
పగిదిఁ దన ముఖమునను జుంబనము చేయు
లీలఁ దగ భుజములను నాలింగనంబు
చేయుగతి దండవన్నమస్కృతు లొనర్చె.

భావము:
భగవంతుడైన హరి గరుడవాహన మెక్కి తన భక్తుడైన ధ్రువుణ్ణి చూడాలనే ఉత్సాహంతో మధువనానికి వచ్చాడు. అప్పుడు ధ్రువుడు ధ్రువమైన భక్తియోగంతో, నిశ్చలమైన బుద్ధితో తన మనస్సులో ప్రకాశిస్తున్న శ్రీహరిని చూస్తూ ఉండటం చేత బయట ఉన్న శ్రీహరిని చూడలేకపోయాడు. ఇంతలో అతని మనస్సులోని మూర్తి మాయమై పోయింది. అప్పుడు ధ్రువుడు తనముందు సాక్షాత్కరించిన కరుణామూర్తిని కనుగొన్నాడు. తొట్రుపాటు చెందాడు. చెక్కిళ్ళపై స్రవించే ఆనంద బాష్పాలతో స్వామిని తిలకించి పులకించాడు. తన కళ్ళతో స్వామి సౌందర్యాన్ని పానం చేస్తున్నట్లు, తన ముఖంతో స్వామిని ముద్దు పెట్టుకుంటున్నట్లు, తన చేతులతో స్వామిని కౌగిలించుకుంటున్నట్లు అనుభూతి పొందుతూ సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేసాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=11&padyam=278

: :  భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...