Monday 14 September 2020

శ్రీ కృష్ణ విజయము - 25

 
( అక్రూర నందాదుల సంభాషణ )

10.1-1209-మ.
నెఱి నేడిక్కడ నీవు రాఁగ వగతో నీతోడ నేమైన నా
కెఱుఁగం జెప్పుమటంచుఁ జెప్పరు గదా యేమందు? రా వార్త యే
తెఱఁగున్ లేదని డస్సిరో వగచిరో దీనత్వముం జెందిరో
వెఱతో నా తలిదండ్రు లెట్లుపడిరో? విన్పింపు మక్రూరకా!
10.1-1210-వ.
మఱియు నీవేమి కారణంబున వచ్చి” తని హరి యడిగిన నతండు కంసునికి నారదుండు వచ్చి చెప్పిన వైరానుబంధ ప్రకారంబును గంసుండు దేవకీ వసుదేవుల వధియింపం గమకించి మానిన తెఱంగును ధనుర్యాగంబు పేరుచెప్పి పుత్తెంచిన ప్రకారంబు నెఱింగించిన రామకృష్ణులు నగి; యంత తమ్ముఁ బరివేష్టించిన నందాది గోపకులం జూచి కృష్ణుం డిట్లనియె.
10.1-1211-శా.
"భూనాథుండు మఖంబుఁ జూఁడఁ బిలువం బుత్తెంచినాఁ డవ్విభుం
గానం బోవలెఁ బాలు నెయ్యి పెరుగుల్గట్నంబులుం గానుకల్
మీ నేర్పొప్పఁగఁ గూడఁబెట్టుఁడు తగన్ మీమీ నివాసంబులన్
యానంబుల్ గొనిరండు పొండు మథురా యాత్రాభిముఖ్యంబుగన్.

భావము:
మరి అక్రూరా! నీవు ఇక్కడకి వస్తున్నావని తెలిసి నాకు చెప్పమని నా తల్లితండ్రులు నీతో ఏమైనా చెప్పారా. వారేమన్నారు. నా కబురులు తమకేమీ తెలియక, వారు శుష్కించి పోయారేమో. దుఃఖపడుతున్నారు కాబోలు. దైన్యాన్ని చెందారేమో. భయంతో వారెలాంటి పాట్లు పడ్డారో నాకు చెప్పు. మరి ఇంకా నీవు దేనికోసం ఇక్కడికి వచ్చావో చెప్పు.” అని కృష్ణుడు అడిగాడు. అప్పుడు అక్రూరుడు నారదుడు వచ్చి చెప్పిన కంసుడికి పూర్వ జన్మ నుండి వచ్చిన శత్రుత్వపు భావమూ, అతడు దేవకీవసుదేవులను చంపబోయి మానిన విషయమూ, ధనుర్యాగము అనే మిషతో తనను పంపిన ప్రకారము వినిపించాడు. అవన్నీ విని రామకృష్ణులు పక్కున నవ్వారు. ఆ మీదట చుట్టూ ఉన్న నందుడు మొదలైన గొల్లపెద్దలతో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. “రాజు కంసుడు ధనుర్యాగం దర్శించడానికి రమ్మని పిలుపు పంపించాడు. ఆ ప్రభువును చూడ్డానికి వెళ్ళాలి. మీమీ ఇళ్ళలోగల పాలు, పెరుగు, నెయ్యి, కట్నాలు, కానుకలు మీ నేర్పుకొద్దీ సమకూర్చండి. బండ్లు సిద్దం చేసుకుని రండి. మనం మధురానగరానికి వెళ్ళాలి.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=140&padyam=1211

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...