Thursday 25 February 2021

శ్రీకృష్ణ విజయము - 158

( ప్రద్యుమ్న జన్మంబు )

10.2-11-వ.
అని, తన్ను లోకులు వినుతించు ప్రభావంబులు గలిగి, పద్మదళలోచనుండును, బ్రలంబబాహుండును, జగన్మోహనాకారుండును నైన పంచబాణునిం గని లజ్జాహాస గర్భితంబు లైన చూపులం జూచుచు, మాయావతి సురత భ్రాంతిఁ జేసినం జూచి, ప్రద్యుమ్నుం డిట్లనియె.
10.2-12-మత్త.
"నా తనూభవుఁ డీతఁ డంచును, నాన యించుక లేక యో!
మాత! నీ విది యేమి? నేఁ డిటు మాతృ భావము మాని సం
ప్రీతిఁ గామినిభంగిఁ జేసెదు పెక్కు విభ్రమముల్‌; మహా
ఖ్యాత వృత్తికి నీకు ధర్మము గాదు మోహము సేయఁగాన్."
10.2-13-వ.
అనిన రతి యిట్లనియె; “నీవు నారాయణనందనుండ వైన కందర్పుండవు; పూర్వకాలంబున నేను నీకు భార్య నైన రతిని; నీవు శిశువై యుండునెడ నిర్దయుండై దొంగిలి, తల్లిం దొఱంగఁజేసి, శంబరుండు కొని వచ్చి, నిన్ను నీరధిలో వైచిన, నొక్క మీనంబు మ్రింగె; మీనోదరంబు వెడలి తీవు; మీఁదటి కార్య మాకర్ణింపుము.

భావము:
అని తనను జనులు స్తుతించే టంతటి ప్రభావం కలిగినవాడు ఆ ప్రద్యుమ్నుడు. తామరరేకుల వంటి నేత్రాలతో. ఆజానుబాహువులతో, ప్రపంచాన్ని సమ్మోహితం చేయగల ఆకార విశేషంతో అలరారే ఆ మన్మథుడిని మాయావతి సిగ్గుతో చిరునవ్వుతో కూడిన చూపులతో ఆకట్టుకోడానికి ప్రయత్నించింది. అప్పుడు ప్రద్యుమ్నుడు ఆమెతో ఇలా అన్నాడు. “ఓ తల్లీ! నేను నీ కుమారుడ ననే భావం లేక, సిగ్గు విడిచి కామినిలా ప్రవర్తిస్తూ విలాసములు చేస్తున్నావు. మాతృభావం వదలివేసావు. నీ విలా నన్ను మోహించుట ధర్మబద్ధమైన పని కాదు.” ఈలాగ పలికిన ప్రద్యుమ్నుడితో రతీదేవి ఇలా చెప్పింది. “నీవు విష్ణుమూర్తి పుత్రుడవైన మన్మథుడవు. పూర్వం నేను నీ భార్యనైన రతీదేవిని. నీవు శిశువుగా ఉండగా దయమాలిన శంబరుడు నిన్ను తల్లి నుండి తప్పించి తెచ్చి, సముద్రంలో పారేసాడు. అప్పుడు నిన్ను ఒక మీనం మ్రింగింది. ఆ చేప కడుపు నుండి నీవు బయట పడ్డావు. ఇక పైన ఏమి చేయవలెనో విను.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=2&Padyam=12

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...