Wednesday 5 May 2021

శ్రీకృష్ణ విజయము - 217

( నరకాసుర వధకేగుట )

10.2-165-వ.
ఇట్లు శిరంబులు చక్రిచక్రధారాచ్ఛిన్నంబు లయిన వజ్రివజ్రధారా దళితశిఖరంబై కూలెడి శిఖరిచందంబున మురాసురుండు జలంబులందుఁ గూలిన, వాని సూనులు జనకవధజనిత శోకాతురులై జనార్దను మర్దింతు మని రణకుర్దనంబునం దామ్రుండు, నంతరిక్షుండు, శ్రవణుండు, విభావసుండు, వసుండు, నభస్వంతుండు, నరుణుండు నననేడ్వురు యోధులు సక్రోధులై కాలాంతకచోదితం బైన ప్రళయపవన సప్తకంబు భంగి నరకాసుర ప్రేరితులై రయంబునఁ బీఠుండనియెడు దండనాథుం బురస్కరించుకొని, పఱతెంచి హరిం దాఁకి శర శక్తి గదా ఖడ్గ కరవాల శూలాది సాధనంబులు ప్రయోగించిన.
10.2-166-ఉ.
ఆ దనుజేంద్రయోధ వివిధాయుధసంఘము నెల్ల నుగ్రతన్
మేదినిఁ గూలనేయుచు సమిద్ధనిరర్గళ మార్గణాళిఁ గ్ర
వ్యాదకులాంతకుండసుర హస్త భుజానన కంఠ జాను జం
ఘాదులఁ ద్రుంచివైచెఁ దిలలంతలు ఖండములై యిలం బడన్.

భావము:
దేవేంద్రుడి వజ్రాయుధం దెబ్బకు శిఖరాలు తెగి కూలిన పర్వతం మాదిరి, శ్రీకృష్ణుడి చక్రం దెబ్బకు శిరస్సులు తెగిన మురాసురుడు నీటిలో కూలిపోయాడు. తండ్రి మరణానికి దుఃఖించిన మురాసురుని ఏడుగురు కుమారులు శోకోద్రిక్తులై జనార్దనుడు అయిన శ్రీకృష్ణుడిని సంహరిస్తామని యుద్ధానికి బయలుదేరారు. కాలాంతకునిచే పంపబడిన ప్రళయకాలం నాటి పవనసప్తకం (ప్రవహము, ఆవహము, ఉద్వహము, సంవహము, వివహము, ప్రతివహము, పరావహము అను ఈ ఏడూ సప్తవాయువులు అనబడును) లాగా నరకాసురుడి చేత ప్రేరేపింపబడిన ఆ తామ్రుడు, అంతరిక్షుడు, శ్రవణుడు, విభావసుడు, వసుడు, నభస్వంతుడు, అరుణుడు అనే ఏడుగురు యోధులు; పీఠుడు అనే సేనానాయకుడి నాయకత్వంలో యుద్ధానికి వచ్చి బాణాలు, శక్తి, గద, రకరకాల కత్తులు, శూలం మొదలైన ఆయుధాలను కృష్ణుడి మీద ప్రయోగించారు. ఆ రాక్షస యోధులు ప్రయోగించే ఆయుధాలు అన్నింటినీ పరాక్రమంతో నేలపాలు చేస్తూ, నిరాటంకంగా బాణాలను ప్రయోగించి, శ్రీకృష్ణుడు ఆ రాక్షసుల చేతులు, కాళ్ళు, కంఠాలు మొన్నగు అవయవాలు అన్నింటినీ నువ్వు గింజలంత ముక్కలు ముక్కలై క్రింద పడేలా ఖండించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=19&Padyam=166

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...