Monday 26 July 2021

శ్రీకృష్ణ విజయము - 291

( నృగుడు యూసరవిల్లగుట )

10.2-481-వ.
మఱియును దన ధనంబు పరులచేతఁ గోల్పడిన విప్రుండు దుఃఖమున రోదనంబు సేయ రాలిన యశ్రుకణంబుల నవనిరేణువు లెన్ని తడియు నన్ని వేలేండ్లు తదుపేక్షాపరుండైన పతి దారుణ వేదనలుగల కుంభీపాక నరకంబు నొందు; మఱియు నతనితోడఁ గ్రిందటఁ బది తరంబులవారును, ముందటఁ బది తరంబులవారును మహానరకవేదనలం బొందుదురు; స్వదత్తంబైన నర్ధలోభంబునం జేసి దుశ్శీలుండై యెవ్వఁడు బ్రాహ్మణక్షేత్ర సంభూత ధాన్యధనాదికంబు భుజించు నప్పాపాత్ముం డఱువదివేల సంవత్సరంబులు మలకూపంబునం గ్రిమిరూపంబున వర్తించు; నట్లగుట యెఱింగి విప్రుడెంత తప్పు చేసిన నెన్ని గొట్టిన, నెన్ని దిట్టిన నతని కెదురు పలుకక వినయంబున వందనం బాచరించు పుణ్యాత్ములు నాదు పాలింటివా; రదియునుంగాక యేనును బ్రతిదినంబును భూసురుల నతి వినయంబునఁ బూజింతు; నిట్లు సేయక విపరీతవర్తనులైన తామసుల నేను వెదకి దండింతు; నదిగావున మీరలును బ్రాహ్మణజనంబుల వలనం బరమభక్తి గలిగి మెలంగుం" డని యానతిచ్చి యాదవప్రకరంబులు సేవింప నఖిలలోకశరణ్యుండైన యప్పుండరీకాక్షుండు నిజ నివాసంబునకుం జనియె” నని చెప్పి శుకుం డిట్లనియె.
10.2-482-క.
"ఈ కథఁ జదివిన వారలుఁ
గైకొని వినువారు విగత కలుషాత్మకులై
లౌకికసౌఖ్యము నొందుదు
రా కైవల్యంబుఁ గరతలామలక మగున్.

భావము:
పరుల వలన తన ధనాన్ని కోల్పోయిన బ్రాహ్మణుడు దుఃఖించి నపుడు, స్రవించిన కన్నీటిధారల వలన భూమిమీద ఎన్ని రేణువులు తడుస్తాయో, అన్ని వేల సంవత్సరాలు ఆ రాజ్యాన్ని పాలించేరాజు కుంభీపాక నరకంలో బాధలు అనుభవిస్తాడు. అంతేకాదు అతడికి పదితరాల పూర్వులూ, తర్వాత పదితరాల వారూ నరకవేదనలను పొందుతారు. తాను ఇచ్చినదైనా, మరొకరు ఇచ్చినదైనా బ్రాహ్మణ భూముల నుండి వచ్చిన ధనధాన్యాలను రాజు దుశ్శీలుడై ఆశించకూడదు. అట్లాశించిన పాపాత్ముడు అరవైవేల సంవత్సరములు మలకూపంలో పురుగై బ్రతుకుతాడు. కనుక, ఈ విశేషాలు గ్రహించి బ్రాహ్మణుడు ఎంత తప్పుచేసినా, ఎన్ని కొట్టినా ఎన్ని తిట్టినా, అతనికి ఎదురు చెప్పకుండా వినయంతో నమస్కరించాలి. అటువంటివారే పుణ్యాత్ములు. అటువంటివారే నా అనుగ్రహానికి పాత్రులవుతారు. అంతేకాదు, నేను కూడా ప్రతిరోజూ బ్రాహ్మణులను మిక్కిలి వినయంతో పూజిస్తాను. ఇలా కాకుండా విపరీతంగా ప్రవర్తించే తామసులను నేను వెదకి దండిస్తాను. అందువలన, మీరు బ్రాహ్మణుల పట్ల మిక్కిలి భక్తిపరులై ప్రవర్తించండి.” అని శ్రీకృష్ణుడు ఆనతిచ్చాడు. ఇలా ధర్మబోధ చేసి, యాదవులు సేవిస్తుండగా శ్రీకృష్ణుడు తన మందిరం చేరాడు.” ఇలా చెప్పిన పిమ్మట శుకమహర్షి ఇలా అన్నాడు. “ఈ కథను చదివినవారికీ, విన్నవారికీ, సర్వపాపాలు తొలగిపోతాయి. ఇహలోకంలో సౌఖ్యం ప్రాప్తిస్తుంది. పరలోకంలో మోక్షం సులభంగా లభిస్తుంది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=41&Padyam=482

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...