Saturday 31 July 2021

శ్రీకృష్ణ విజయము - 295

( పౌండ్రకవాసుదేవుని వధ )

10.2-517-క.
పరిఘ శరాసన పట్టిస
శర ముద్గర ముసల కుంత చక్ర గదా తో
మర భిందిపాల శక్తి
క్షురికాసిప్రాస పరశుశూలముల వెసన్.
10.2-518-చ.
పరువడి వైచినన్ దనుజభంజనుఁ డంత యుగాంత కాల భీ
కరమహితోగ్ర పావకుని కైవడి నేచి విరోధిసాధనో
త్కరముల నొక్కటన్ శరనికాయములన్ నిగిడించి త్రుంచి భా
స్వరగతి నొత్తె సంచలితశాత్రవసైన్యముఁ బాంచజన్యమున్.
10.2-519-ఉ.
వారని యల్కతోఁ గినిసి వారిజనాభుఁడు వారి సైన్యముల్‌
మారి మసంగినట్లు నుఱుమాడినఁ బీనుఁగుఁబెంటలై వెసం
దేరులు వ్రాలె; నశ్వములు ద్రెళ్ళె; గజంబులు మ్రొగ్గె; సద్భటుల్‌
ధారుణిఁ గూలి; రిట్లు నెఱిదప్పి చనెన్ హతశేషసైన్యముల్‌.

భావము:
పరిఘ, విల్లు అమ్ములు, పట్టిసం, ముసలం, సమ్మెట, ఈటె, చక్రం, గద, చిల్లకోల, బాకు, శక్తి ఆయుధము, చురకత్తి, గొడ్డలి, శూలం మొదలైన ఆయుధాలను చేపట్టి శ్రీకృష్ణుడి మీద వేగంగా ప్రయోగించాడు. దానితో, దానవాంతకుడు కృష్ణుడు భయంకర ప్రళయాగ్ని వలె విజృంభించి విరోధి ప్రయోగించిన ఆయుధాలు అన్నింటినీ తన బాణ సమూహంతో త్రుంచివేశాడు. శత్రుసైన్యాలకు సంచలనం కల్గించే తన పాంచజన్య శంఖాన్ని పూరించాడు. అమితమైన ఆగ్రహంతో సరోజనాభుడు శ్రీకృష్ణుడు, మారి మహామారి వ్యాపించి సంహరించినంత భీకరంగా, వారియొక్క సైన్యాలను నాశనం చేసాడు; రథాలు విరిగిపోయాయి; అశ్వాలు కూలాయి; ఏనుగులు వ్రాలాయి; కాల్బలం గడ్డి కరచింది; ఈ విధంగా రణరంగము అంతా పీనుగుపెంటలు అయిపోయింది; మరణించకుండా మిగిలిన సైన్యం పరాక్రమం చెడి పారిపోయాయి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=44&Padyam=519

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...