Sunday 12 July 2015

శ్రీ దత్తాత్రేయ వైభవం - 25:

22. ఇరవై రెండవ గురువు - లోహపు పనివాడు :

తన పని చేస్తున్నప్పుడు లోహపు పనివాడు ఎంత శ్రద్ధతో చేస్తాడో అంత బాగా తయారవుతాయి పనిముట్లు. ఒక పనిముట్టును అద్భుతంగా తీర్చిదిద్దాలంటే ఆ పని మీద పట్టు, చేయాలనే ఆసక్తి ఉండాలి. లేకుంటే ఆ పని ఎంత చేసినా లాభం ఉండదు. అలాగే మనిషి కూడా ఏ పని చేసినా శ్రద్ధతో, అమితాసక్తితో చేయాలి. పూజ కూడా ఏదో తంతుగా, తూతూ మంత్రంగా చేస్తారు చాలా మంది. కానీ అలా చేస్తే ఫలితం ఉంటుందా అనేది మనం ఆలోచించాలి. 

పూజను ఒక ప్రక్రియగా భావిస్తారే తప్ప దాని మీద ప్రేమతో చేయరు. పూజ చేసేటప్పుడు కూడా శ్రద్ధాలోపం చాలా చూస్తూంటాం. ఎలాగంటే వారు పూజలో చదివేదొకటి చేసేదొకటి. ఉదాహరణకు శ్రద్ధలేని ఓ వ్యక్తి పూజలో ఉన్నప్పుడు పుష్పం సమర్పయామి అని అంటూనే ఒక పండును ప్రసాదంగా పెట్టాడట. ఒక్క పూజ అనే కాదు ఎన్నో పనుల్లో చాలా మంది ఇలాగే చేస్తారు. 

మనసు ఒకటి ఆలోచిస్తుంది చేతలు ( చేసే పని ) మాత్రం వేరేగా ఉంటాయి. అలా చేస్తున్నప్పుడు ఒక్కోసారి ప్రమాదం కూడా జరిగే అవకాశం ఉంది. అందుకే ఏ పనిచేసినా శ్రద్ధ, ఆసక్తి, శ్రమ అనేది ముఖ్యమంటాడు దత్తాత్రేయుడు. 

23. ఇరవై మూడవ గురువు - సాలెపురుగు: 

సాలెపురుగు తన సాలీడు ఎంతో అందంగా మరియు ఎంతో నైపుణ్యంతో నిర్మిస్తుంది. దాన్ని కట్టడానికి ఎంతగానో శ్రమిస్తుంది. అలా నిర్మించాక ఆ సాలీడులో చాలా కాలం నివసించి తరువాత అవే సాలెపురుగులు తమ సాలీడును తామే తినేస్తాయి.

భగవంతుడు కూడా అంతే, ఈ మాయా సృష్టిని తానే నిర్మించి, ఆ సృష్టితో ఆటలాడి కొంత కాలం తరువాత మళ్ళీ తనలోనే లయం చేసుకుంటాడు. కానీ మనం మాత్రం ఈ సృష్టే నిజమనుకుని భ్రమిస్తూంటాం. కాని ఇదంతా అసత్యమే కేవలం సచ్చిదానంద బ్రహ్మము మాత్రమే సత్యమంటాడు దత్తాత్రేయుడు..... ( ఇంకా వుంది )


No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...