Wednesday 12 August 2020

శ్రీ కృష్ణ విజయము - 2

( కంసుని మంత్రాలోచన )

10.1-1151-వ.
మఱియు నలుక దీఱక కంసుండు దేవకీవసుదేవుల లోహపాశ బద్ధులంజేసి కేశియనువానిం బిలిచి రామకేశవులం జంపుమని పంపి మంత్రి భట గజారోహక చాణూర ముష్టిక సాల్వ కోసల ప్రముఖుల రావించి యిట్లనియె.
10.1-1152-శా.
"ఎందున్ నన్నెదిరించి పోరుటకు దేవేంద్రాదులుం జాల రీ
బృందారణ్యము మంద నిప్పుడు మదాభీరార్భకుల్ రామ గో
విందుల్ వర్ధిలుచున్న వారఁట రణోర్విం గంసుని ద్రుంతు మం
చున్ దర్పంబులు పల్కుచుందు రఁట యీ చోద్యంబులన్ వింటిరే?
10.1-1153-క.
పట్టణజనములు చూతురు
దట్టంబుగ మల్లరంగతల పార్శ్వములం
బెట్టింపుఁడు తమగంబులు
పుట్టింపుఁడు వీట మల్లుపో రను మాటన్.

భావము:
అంతటితో కంసుడికి అలక తీరలేదు. అతడు దేవకీ వసుదేవులను ఇనప సంకెళ్ళతో బంధించాడు. కేశి అనేవాణ్ణి పిలచి, గోకులానికి వెళ్ళి రామకృష్ణులను చంపి రమ్మని పంపించాడు. తరువాత మంత్రులను, భటులను, మావటివాళ్ళను, చాణూరుడు ముష్టికుడు అనే జెట్టీలనూ, సాల్వుడు కోసలుడు మొదలైన ముఖ్యులనూ పిలిపించి వారితో ఇలా అన్నాడు. “ఎక్కడైనా, ఇంద్రాదులకు సైతం నన్ను ఎదిరించి పోరాడా లంటే శక్తి చాలదు. అలాంటిది, బలరామకృష్ణులు అనే మదించిన గొల్లపిల్లలు ఇప్పుడు బృందావనంలో పెరుగుతున్నారుట. “కదనభూమిలో కంసుణ్ణి చంపుతా” మంటూ బీరాలు పలుకుతున్నారుట. మీరు ఈ వింత మాటలు విన్నారా? మల్లజెట్టీ పోటీ ఏర్పాటు చేయండి. మల్ల రంగానికి ముందువైపుల మంచెలు అమర్చండి. పుర ప్రజలు చూస్తారు. నగరం నలుమూలల చాటింపు వేయించండి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=131&padyam=1153

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...