Monday 22 February 2021

శ్రీకృష్ణ విజయము - 156

( ప్రద్యుమ్న జన్మంబు )

10.2-6-వ.
సముద్రంబులోన నా మీనంబును, దత్సహచరంబులైన మీనంబులనుం బట్టికొని తెచ్చి, శంబరునకుం గానికఁగా నిచ్చిన, నతండు “వండి తెండ”ని మహానస గృహంబునకుం బంచిన.
10.2-7-క.
రాజునగరి యడబాలలు
రాజీవముకడుపు వ్రచ్చి, రాజనిభాస్యున్
రాజశిశువుఁ గని, చెప్పిరి
రాజీవదళాక్షియైన రతికి; నరేంద్రా!
10.2-8-వ.
అంత నారదుండు వచ్చి, బాలకుని జన్మంబును, శంబరోద్యోగంబును, మీనోదరప్రవేశంబునుం జెప్పిన విని, యా రతి మాయావతి యను పేర శంబరునియింట బాతివ్రత్యంబు సలుపుచు, దహన దగ్ధుండయిన తన పెనిమిటి శరీర ధారణంబు సేయుట కెదురు చూచుచున్నది గావున; నయ్యర్భకుండు దర్పకుండని తెలిసి, మెల్లన పుత్రార్థినియైన తెఱంగున శంబరుని యనుమతి వడసి, సూపకారుల యొద్ద నున్న పాపనిం దెచ్చి పోషించుచుండె; నా కుమారుండును శీఘ్రకాలంబున నారూఢ యౌవనుండై.

భావము:
ప్రద్యుమ్నుడిని మ్రింగిన పెనుచేపతోపాటు తిరుగుతున్న మరికొన్ని చేపలను కూడా పట్టుకున్నారు. వాటిని తీసుకువచ్చి శంబరునకు కానుకగా సమర్పించారు. శంబరుడు ఆ చేపలను వండితెమ్మని వంటశాలకు పంపాడు. వంటవారు ఆ చేప కడుపు కోయగా చంద్రబింబంతో సమానమైన ముఖంతో విలసిల్లుతున్న బాలుడు కనిపించాడు. వారు ఈ విషయాన్ని రతీదేవికి విన్నవించారు. అంతకు ముందే నారదమహర్షి రతీదేవికి ఇలా రుక్మిణి కడుపున పుట్టే బాలుడి జన్మరహస్యం, వానిని నాశం చేయాలనే శంబరుడి ప్రయత్నం, ఆ శిశువును చేప మ్రింగడం అంతా చెప్పాడు. శంకరుడి కంటిమంటలకు ఆహుతి అయిపోయిన తన భర్త ఎప్పుడు సశరీరంగా సాక్షాత్కరిస్తాడా అని ఎదురు చూస్తూ శంబరుని గృహంలో మాయావతి అనే పేరుతో నీతిగా జీవిస్తున్న రతీదేవి ఆ బాలుడు మన్మథుడే అని తెలుసుకుంది. పుత్రార్థిని వలె శంబరుడి అనుమతితో, ఆ శిశు రూప మన్మథుడిని వంటవారి నుండి తీసుకుని పోషించసాగింది. ఆ బాలుడు శీఘ్రకాలంలోనే యౌవనవంతుడు అయ్యాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=2&Padyam=7

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...