Wednesday 21 July 2021

శ్రీకృష్ణ విజయము - 287

( నృగోపాఖ్యానంబు )

10.2-472-క.
అని మఱియును నవ్విప్రుని
సునయోక్తుల ననునయింపుచును నిట్లంటిన్
"ననుఁ గావు, నరకకూపం
బునఁ బడఁగా జాలఁ విప్రపుంగవ!" యనుచున్.
10.2-473-తే.
"ఎంత వేఁడిన మచ్చరంబంత పెరిఁగి
మొదల నాకిచ్చి నట్టి యీమొదవె కాని
యెనయ నీ రాజ్యమంతయు నిచ్చితేని
నొల్ల" నని విప్రుఁ డచ్చట నుండ కరిగె.
10.2-474-వ.
అ ట్లతం డరిగిన నా రెండవ బ్రాహ్మణునిం బ్రార్థించిన నతండును జలంబు డింపక "పదివే లేఱికోరిన పాఁడిమొదవుల నిచ్చిననైనను దీనిన కాని యొల్ల” నని నిలువక చనియె; నంతఁ గాలపరిపక్వం బైన నన్ను దండధరకింకరులు గొనిపోయి వైవస్వతు ముందటం బెట్టిన నతండు నన్ను నుద్దేశించి యిట్లనియె.

భావము:
ఇంకా ఆ బ్రాహ్మణుని రకరకాలుగా బతిమాలి, ప్రాధేయపడి, “మహాత్మా నన్ను నరకకూపం నుండి రక్షించండి” అని ప్రార్థించాను. నేను ఎంత వేడుకుంటుంటే అతనిలో మచ్చరం అంత పెచ్చుపెరిగిపోయింది. “మొదట నీవు నాకు ఇచ్చిన గోవును తప్ప, నీవు నీ రాజ్యమంతా ఇస్తాను అన్నా నేను అంగీకరించను” అని చెప్పి అక్కడ నుంచి విసవిసా వెళ్ళిపోయాడు. ఆ బ్రాహ్మణుడు వెళ్ళిన తరువాత రెండవ బ్రాహ్మణుడిని ఆ గోవును ఇవ్వమని ప్రార్థించాను. అతడు కూడా పట్టుదలతో “నీవు పదివేల గోవులను ఇచ్చినా, నాకు అవసరం లేదు. నాకు ఈ గోవే కావాలి.” అని అతను కూడా అక్కడ ఆగకుండా వెళ్ళిపోయాడు. ఆ తరవాత కాలం పరిపూర్తి కాగా నన్ను యమభటులు తీసుకుని వెళ్ళి యమధర్మరాజు ముందు నిలిపారు. యమధర్మరాజు నాతో ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=40&Padyam=474

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...